ఎడారిలో ఒంటెలు మాత్రమే జీవిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఎడారికే పరిమితం అవుతాయి. కాలం మారినా అవి మాత్రం ఎడారిలోనే జీవనం గడుపుతాయి .ఎన్ని యుగాలైనా సరే , అవి ఎడారిలోనే ఉంటూ ప్రయాణించే వారికి ఆ ఎడారులలో ఉపయోగపడతాయి. అందుకే వాటిని " ఏడారి ఓడలుగా" పరిగణిస్తారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే వారి దుర్భర జీవితం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు? ఎండవేడిమికి తట్టుకుని ఎడారులలో సంచరిస్తూ ఉంటాయి.అవి ఎంతో బాధను అనుభవిస్తూ దుర్భర జీవితాన్నిగడుపు తుంటాయి.
ఆ విధంగానే జీవనాన్ని గడుపుతున్నారు భిక్షగాళ్లు .భిక్షగాళ్లు ప్రతిరోజూ తిరగాల్సిందే. అలా తిరిగితేనే నాలుగు పైసలు పుట్టేది.అయితే ఎంత తిరిగినా కొన్నిసార్లు ఆ నాలుగు పైసలు పుట్టవు. ఇక వారు భిక్షం అడుక్కోవడానికే పుట్టినట్టున్నారు. వారి బాధ చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది.మన కంటి నుండి నీరు కారకుండా మానదు. నిద్రాహారాలు లేకుండా ఉంటారు, ఆకలిని చంపుకొని ఉంటారు .
ప్రతి సంవత్సరం చూస్తే వేల కొద్ది వీరు పెరుగుతుండటం విశేషం. ప్రస్తుతం వీరి జనాభా అత్యధికంగా పెరుగుతుందని చెప్పవచ్చు.
ఇక ప్రతిరోజు వారికి అదే కార్యక్రమం ఉంటుంది .ఉదయాన్నే గుడి వద్దకు, మధ్యాహ్నం వేళ రోడ్ల మీదికి, సాయంత్రం మళ్లీ గుడి వద్దకు వెళ్తారు.రోజంతా కష్టపడితే వారికి నాలుగైదు పైసలు వస్తాయి. ఒక్కోసారి వారికి చిల్లిగవ్వకూడా రావు. చెప్పాలంటే ,వారు ఎంత కష్టపడితే ఎంత సంపాదిస్తారు? వారు వేలు ,లక్షలు ఎప్పుడైనా చూసి ఉంటారా, కనీసం కడుపు నిండా సంతోషంగా భోజనం తిని ఉంటారా,కనీసం కంటినిండా నిద్రపోయి ఉంటారా.
ప్రతి ఒక్కరూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే వాహనాలను ఉపయోగిస్తారు .మరి వారికి నడక దారే గతి .అన్ని ప్రాంతాలు ,అన్ని ఏరియాలు,అన్ని ప్రదేశాలు వారివే.ఏ ఒక్క ప్రదేశంను వదిలిపెట్టి ఉండరు .నడక దారిలోనే వారి ప్రయాణం అంతా సాగుతుంది .ఏవైనా పండుగల సమయాల్లో ప్రతి గుడి దగ్గర వేల మంది బిచ్చగాళ్లు ఉంటారు. కనీసం అప్పుడైనా దేవుడు కరుణిస్తాడని, నాలుగైదు పైసలు పుడతాయని వారి ఆశ.
ఇక మిగతా సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను చూసుకుంటారు .ఎండా, వాన ,రేయి పగలు అనే తేడా లేకుండా ప్రతిరోజు ఈ విధంగా బిచ్చ మెత్తుకుంటూ ఉంటారు .కానీ వారికి తెలియదు ఈ సమాజంలో దోచుకునే మూర్ఖులు ఎక్కువ అవుతున్నారని. కనీసం వారిని చూచి చులకనగా చూస్తారు కానీ ,నాలుగైదు పైసలు మాత్రం ఇవ్వరు.వారి స్థానంలో ఉండి చూస్తే తెలుస్తుంది వారు పడే తపన ఏమిటో.
ఇక వారి పిల్లల జీవితం చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు. ఆ పసి పిల్లలకు తెలుస్తుందా ,భిక్షం ఎత్తుకునే విధంగా పుడతామని, బుల్లిబుల్లి అడుగులతో ఎంతో హాయిగా ఉండాల్సిన వారు, ఇలా అడుక్కోవడం బాధ కలిగించే విషయం. వారి బాల్యం అంతా ఒకసారి చూసుకుంటే ఏమీ ఉండదు. పుట్టినప్పటి నుంచి మరణించినప్పటి వరకు అవే సమస్యలు, అదే దుర్భర జీవితం.
గుడి వద్ద అడుక్కుంటున్నారు, రోడ్ల మీద అడుక్కుంటున్నారు , రద్దీ ప్రాంతాల్లో కూడా అడుక్కుంటున్నారు .ఏ ఏరియా చూసినా ,ఏ ప్రదేశం చూసిన వీరే కనపడతారు.
ఇక వీరిలో ఏ ఆశయాలు ఉండవు, ఏ కోరికలు కనిపించవు. ఉన్నది ఒకటే కోరక బిక్షాటన చేయడం, మూడు పూటలా కడుపునిండా తినడం. వీరిలో మనలా హడావిడి ,తాపత్రయాలు కనిపించవు , ,అబద్ధాలు కనిపించవు, మోసాలు కనిపించవు, హోదాలు, పేరు ప్రఖ్యాతలు ఇవేమీ ఉండవు .వీరి జీవితం అంతా ఒక్కటే ,వచ్చిన నాలుగైదు పైసలతో కడుపు నింపుకోవడం.కడుపు నింపుకుంటూ జీవితాన్ని సాగిస్తారు. కాలం మారినా వీరిని మార్చేవారు కనపడటం లేదు.ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా వీరు మాత్రం ఇలాగే ఉండాల్సి వస్తుందేమో.