విద్య అనేది జ్ఞానాన్ని ఇస్తుంది, బుద్ధిని ప్రసాదిస్తుంది, వినయం విధేయతలను నేర్పిస్తుంది. విద్య అనేది ప్రతి ఒక్కరికీ కావాలి మరియు ఎంతో అవసరం కూడా. విద్య ఉన్నత శిఖరాలను చేరడంలో సహాయపడుతుంది. త్వరితగతిన గమ్య స్థానానికి అనగా, చదువుల పరంగా ఏ విధమైన కలలు కంటామో, ఆ కలలు నెరవేరడానికి కృషి చేస్తుంది ,అలాగే అత్యున్నత శిఖరాలను చేర్చటమే గాక ,పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది. మరి అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, అత్యున్నత శిఖరాలను చేరాలంటే, విద్య ఎంతో అవసరం.
విద్య ప్రతి ఒక్కరి ఆశయం.కానీ కొంతమందికి అనివార్య కారణాల వలన కుదరకపోవచ్చు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని ఆశయంతో ఉంటారు. పెద్ద చదువులు చదివించాలని అనుకుంటారు .ఎంత కష్టపడైనా, తమ పిల్లల ఫీజులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటారు. ఫీజులు లక్షల్లో ఉన్న కూడా, తమ పిల్లల చదువులు బాగుండాలనే కోరికతో ఎంతటి ఫీజులైనా వెనకాడడం లేదు.
అయితే ప్రస్తుతం మనం గమనిస్తే, ప్రతి ఒక్కరికీ చదువు నెపంతో ఫీజులు భారం అయిపోతున్నాయి . ఇప్పుడు పిల్లలను చదివించాలంటే ఫీజులు వేలల్లో కాదు ,లక్షల్లో కావాలి .కానీ తల్లిదండ్రులుఎంత మాత్రం అందుకు ఆలోచించడం లేదు. తమ పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నారు. ఎంతటి ఫీజులైనా సరే కట్టాల్సిన పరిస్థితి.
కానీ ,దీన్ని అలుసుగా చేసుకుని కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరి నుంచి లక్షలను సొమ్ముచేసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం ఫీజులను పెంచుతూ ,అడ్డగోలుగా సంపాదించుకుంటున్నాయి .విద్యతో వ్యాపారాన్ని చేసుకుంటున్నాయి .చదువుల సరస్వతిని ఒక వ్యాపార వాణిజ్యంగా మార్చుకుంటున్నారు .
డబ్బు కోసం విద్యను, వ్యాపార కేంద్రంగా మార్చి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.కానీ పిల్లల తల్లిదండ్రులు ఇందుకు ఏమాత్రం ఆలోచించడం లేదు . కార్పొరేట్ వాళ్లు విద్యతో వ్యాపారం చేస్తున్నా కూడా, తమ పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం చదివించాల్సిన తప్పని పరిస్థితి.ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్లు ,కాలేజీలు మార్కుల నెపంతో, వారి స్కూళ్లకు గానీ, కాలేజీలకు గానీ ఒక బ్రాండ్ ఇమేజ్ ని తీసుకువచ్చి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంచుకుంటున్నాయి. దానిని చూసి తల్లిదండ్రులు ఆ కాలేజీలు, స్కూళ్ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఆ విధంగా విద్యను ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా చేసుకుని కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం ఫీజులను పెంచి, అటు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తు, అలాగే చదువుల నెపంతో పిల్లలపై కూడా ఒత్తిడి తెస్తున్నాయి .దీనికి ఫలితాలే పిల్లల ఆత్మహత్యలు . ప్రతి ఏటా చదువుల నేపంతో ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలు, అంతకంతకు పెరిగిపోతున్నారు .అదే విధంగా తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా చాలామంది తల్లిదండ్రులు నానా కష్టాలు పడి అప్పులు చేస్తున్నవారూ ఉన్నారు . ప్రస్తుతం విద్య అనేది వ్యాపారం అయిపోయింది. చదువుల సరస్వతి అంగడిలో బొమ్మలాగా మారిపోయింది .ఒకప్పటి చదువు, ఇప్పటి చదువు ఎలా ఉండేదో ఒకసారి మనం గమనిస్తే తెలుస్తుంది.